AP News | ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర పాస్పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20న ఆయన విదేశాలకు వెళ్తుండటంతో తక్షణమే పాస్పోర్టును పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించింది.
తన పాస్పోర్టును రెన్యువల్ చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల అధికారులను ఆశ్రయించారు. కానీ కొల్లు రవీంద్రపై క్రిమినల్ కేసులు ఉండటంతో అధికారులు ఆయన వినతిని నిరాకరించారు. దీంతో మంత్రి రవీంద్ర నిన్న (గురువారం) హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలో జరగనున్న మైన్ ఎక్స్పో కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని.. అందుకే తన పాస్పోర్టును రెన్యువల్ చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
క్రమినిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో పాస్పోర్టును తిరస్కరించవద్దని హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీర్పులిచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది ఎంవీ రమణకుమారి వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్ర హోం శాఖ, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పాస్పోర్టు అధికారిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం.. వెంటనే పాస్పోర్టును పునరుద్ధరించాలని ఆదేశించింది.