అమరావతి : రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహాపాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులను రైతులు పాటించాలని సూచించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని స్పష్టం చేసింది . పోలీసులకు మరోసారి అనుమతి కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది . దరఖాస్తు పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశించింది.
ఇవాళ హైకోర్టు ప్రారంభమైన వెంటనే తొలి పిటిషన్గా స్వీకరిస్తామని నిన్ననే హైకోర్టు వెల్లడించింది . ఈమేరకు పిటిషన్ను పరిశీలించిన న్యాయవాదులు రైతుల మహాపాదయాత్రనకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిన్న పిటిషన్ను పరిశీలించిన కోర్టు పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. పోలీసులు వెంటనే దరఖాస్తును పరిశీలించాలని ఆదేశించగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అర్ధరాత్రి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు. అనుమతి నిరాకరణకు గల కారణాలను డీజీపీ తెలియజేశారు. గత ఏడాది కోర్టు అమరావతి నుంచి తిరుపతి దేవస్థానం వరకు నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన షరతును ఉల్లంఘిం చడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారని వివరించారు. కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామని డీజీపీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.