అమరావతి: విశాఖపట్నంలో పేదల ప్లాట్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నంలో 1.85 లక్షల మంది లబ్ధిదారులకు 6000 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ పేదలకు భూములు కేటాయించకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు.. అన్ని పిటిషన్లను కొట్టివేయడమే కాకుండా.. ప్లాట్ల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగనన్న ఇళ్ల పథకం కింద పేదలకు లబ్ధి చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో మొత్తం 6,116.50 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్కు శ్రీకారం చుట్టింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు భూముల కేటాయింపు ప్రక్రియను ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా భూముల కేటాయింపునకు ప్రభుత్వం ఇప్పటికే టోకెన్లు జారీ చేసి హద్దులు కూడా వేసింది. హైకోర్టు తాజా తీర్పుతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కటౌట్కు పాలాభిషేకం చేసేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.