అమరావతి: ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కీలక తీర్పునిచ్చింది. అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డిని ఈఓగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. టీటీడీ ఈఓగా నియమించేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని కోర్టు తేల్చిచెప్పింది. ఈ పిటిషన్ను తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి దాఖలు చేసి.. ధర్మారెడ్డిని అదనపు ఈఓగానే కొనసాగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
తిరుపతి తిరుమల దేవస్థానానికి డిప్యుటేషన్పై 2019 లో ఏవీ ధర్మారెడ్డి వచ్చారు. ఆయన 1991 లో ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్స్ సర్వీస్ గ్రూపు-ఏ సర్వీసుల్లో యూపీపీఎస్సీ ద్వారా చేరారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 2019 లో ఆయనను కేంద్రం ఆంధ్రప్రదేశ్కు డిప్యుటేషన్పై పంపింది. ఈ ఏడాది మే 14 తో ఆ డిప్యుటేషన్ కాలపరిమితి కూడా ముగిసింది. అయినప్పటికీ ఆయనను వెనక్కి పంపకుండా అదనపు ఈఓ స్థాయి నుంచి ఈఓగా పోస్టింగ్ ఇచ్చారు.
కాగా, ఐడీఈఎస్ అధికారి అయిన ధర్మారెడ్డికి జిల్లా కలెక్టర్ స్థాయి అర్హత లేదని, అలాంటప్పుడు ఆయనను టీటీడీ ఈఓగా ఎలా నియమిస్తారంటూ పిటిషన్దారు నవీన్ కుమార్రెడ్డి కోర్టులో దావా వేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుచేసి ఆ హోదాకు సమానమైన అర్హతలున్న వ్యక్తిని నియమించేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై విచారించిన ఏపీ హైకోర్టు టీటీడీ ఈఓగా నియమించేందుకు కావాల్సిన అర్హతలన్నీ ధర్మారెడ్డికి ఉన్నాయని, ఆయనను ఈఓగా నియమించడంలో ఎలాంటి తప్పిదం జరుగలేదని స్పష్టం చేసింది. దీంతో ఈఓగా ఆయన నియామకానికి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోయాయి.