అమరావతి : ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్మెంట్పై తీసుకున్న నిర్ణయ జీవోల విడుదలపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు సీఎం జగన్కు అసంతృప్తి లేఖను పంపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 23.29 శాతం ఫిట్మెంట్ మధ్యంతర భృతి కన్నా తక్కువగా ఉన్న దాఖలాలు లేవని పేర్కొన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన వేతన సవరణ జీవో ఎంతగానో నిరాశపరిచిందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తమ జీతాలు, జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయని ఆశతో ఇక్కడికి వచ్చామని , తీరా తమకు నిరాశే ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంటి అద్దె అలవెన్స్ 30 శాతం, ఉచిత వసతి, ఐదు రోజుల పనిదినం, రవాణా సౌకర్యాలు కల్పించిందన్నారు.
అంతేకాక సీఆర్డీఏ పరిధిలో నామమాత్రపు ధరతో ఫ్లాట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసిందన్నారు. ఇటీవల మీరు ప్రకటించిన పీఆర్సీ జీవోలతో ప్రస్తుత అద్దె అలవెన్స్ స్లాబ్ ప్రకారం ఏపీలో ఏ నగరంలోనూ ఇల్లు అద్దెకు తీసుకునే పరిస్థితి లేదని లేఖలో వెల్లడించారు.