అమరావతి: మరోసారి పవన్ కల్యాణ్ను జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. తనకు వ్యతిరేకంగా గళం విప్పి రాజకీయంగా రావడమే కాకుండా ఇటీవలి చర్చల సందర్భంగా రాకపోవడాన్ని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటున్నది. పవన్ కల్యాణ్పై తమ కసిని తీర్చుకోవడం ద్వారా పైచేయి సాధించేందుకు ఎప్పుడూ ఏదో ఒక అంశాన్ని ముందుకు తెస్తున్నది. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది.
పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే, పవన్ కల్యాణ్పై పీకల దాకా కోపంతో ఉన్న ఏపీ సీఎం జగన్.. సరిగ్గా ఇదే సమయంలో దెబ్బకొట్టాలన్న నిర్ణయానికొచ్చారు. అనుకున్నదే తడవుగా భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించే సినిమా థియేటర్లు టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని మెలిక పెట్టింది.
ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల యాజమాన్యాలకు మౌఖిక ఆదేశాలను అందించినట్లు సమాచారం. టికెట్ రేట్లు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తున్నది. గతంలో వకీల్సాబ్ సినిమా విడుదలకు ముందు కూడా ఇదే మాదిరిగా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరల పెంపుపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాకపోవడం విశేషం.