Govt | సంక్రాంతి సెలవులను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ఈ నెల 14,15,16 తేదీలను సెలవు రోజులుగా ప్రకటించింది. ఆ తర్వాత దీనిని మార్చేసింది. వీటికి బదులుగా 13,14,15 తేదీలను సంక్రాంతి సెలవు రోజులుగా ప్రకటించింది. అలాగే నైట్ కర్ఫ్యూ అమలు చేసే విషయంలోనూ తన ఆదేశాలను సవరించుకుంది.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులపై పలువురు సిద్ధాంతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే 14 తేదీన పండగ జరుపుకోవాలా? 15 న జరుపుకోవాలా? అన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. కొందరు 14 న అంటుంటే, మరికొందరు 15 న అంటున్నారు. దేశ వ్యాప్తంగా పండగ సెలవు 14 అని ప్రకటించారు. ఏపీ సర్కార్ మాత్రం 15 అని ప్రకటించింది. జనవరి 14 మధ్యాహ్నం 2:29 నిమిషాలకు కచ్చితంగా మకర సంక్రమణం జరుగుతుందని పలువురు పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు కూడా 14 నే చేయాలని, కానీ ప్రభుత్వం 15 వ తేదీని సెలవుగా ప్రకటించిందన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.
సంక్రాంతి పండగ తర్వాత నైట్ కర్ఫ్యూను అమలులోకి తేనుంది సర్కార్. అంటే జనవరి 18 నుంచి 31 వరకూ రోజు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూను విధించనున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు ఊళ్లకు వెళ్లడం, రావడం జరుగుతుందని, నైట్ కర్ఫ్యూ విధిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సర్కారు సంక్రాంతి పండగ తర్వాత నైట్ కర్ఫ్యూను విధించాలని నిర్ణయం తీసుకుంది.