అమలాపురంలో జరుగుతున్న తీవ్ర నిరసనలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని అందరూ ప్రతిపాదించారు కాబట్టే, పెట్టామని స్పష్టం చేశారు. అప్పటికప్పుడు పెట్టిన పేరు మాత్రమూ కాదన్నారు. ఇలా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్లు, కోరికలు వచ్చాయి కాబట్టే, పేరు మార్చాలని నిర్ణయించామన్నారు. అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు నీటిబుడగ లాంటివని సజ్జల అభివర్ణించారు. అతి త్వరలోఏ సమసిపోతాయన్నారు.
ఉదయం లేచిన మొదలు అందరూ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంటారని, రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ గుర్తుకొస్తారని అన్నారు. అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తికి కులం అంటగట్టడం తప్పని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా పేరు మార్పు కుదరదని పరోక్షంగా పేర్కొన్నారు. అయితే అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఆందోళన చేస్తున్న గ్రూపులతో కచ్చితంగా సంప్రదింపులు జరుపుతామని సజ్జల ప్రకటించారు. అసలు వారికి ఉన్న అభ్యంతరాలేమిటో అడిగి తెలుసుకుంటామన్నారు. పేరు మార్పు వెనుక ఉన్న హేతుబద్ధతను వివరిస్తామని, ఆమోదయోగ్యం చేస్తామన్నారు. అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలన్నది ఇప్పటికిప్పుడు వచ్చిన డిమాండ్ కాదని, జిల్లాల పునర్విభజన నుంచే ఉందని గుర్తు చేశారు.
రాజకీయంగా, ప్రజా సంఘాల నుంచి కూడా కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ వచ్చిందని సజ్జల వివరించారు. కేవలం దళిత సంఘాల నుంచే ఈ డిమాండ్ రాలేదని, అన్ని సమాజాల నుంచి ఈ డిమాండ్ వచ్చిందన్నారు.ఈ సమస్య పరిష్కారం కాని సమస్య కాదని, కచ్చితంగా పరిష్కారం అవుతుందని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు.