AP News |ఖరీఫ్ సీజన్ 2024కి సంబంధించి ఏపీ ప్రభుత్వం కరువు మండలాల జాబితాను ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరువు ప్రభావితానికి గురయ్యాయని తెలిపింది. ఈ మేరకు ఆయా మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
కర్నూలు, అనంతపురం శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ 54 మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడంతో ఈ దుర్భి్క్ష పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో తెలిపింది. వీటిలోని 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్షం ఉంటే.. మరో 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
తీవ్ర కరువు మండలాలివే..
అనంతపురం జిల్లాలోని నార్పల.. అనంతపురం శ్రీసత్యసాయి జిల్లాలోని తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల.. అన్నమయ్య జిల్లాలోని గాలివీడు, చిన్నమండెం, సంబెపల్లె, టి.సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డి పల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలపడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురుబలకోట, పెద్దతిప్ప సముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె.. చిత్తూరు జిల్లాలోని పెనుమూరు, యాదమర్రి, గుడిపాల మండలాలను తీవ్ర కరువు మండలాలుగా నోటిఫై చేశారు.
కర్నూలు జిల్లాలోని కౌతాలం, పెద్దకడుబూరు.. అనంతపురం జిల్లాలోని విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు.. శ్రీసత్యసాయి జిల్లాలోని కనగానిపల్లి, ధర్మవరం, నంబుల పులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి.. చిత్తూరు జిల్లాలోని శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం మండలాలను కరువు మండలాలుగా గుర్తించారు.