అమరావతి: సీపీఎస్ అంశంపై చర్చించేందుకు ఉద్యోగులను ఏపీ సర్కార్ ఆహ్వానించింది. ఈ అంశంపై కూలంకశంగా చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఉన్నతాధికారులకు సూచించినట్లుగా తెలుస్తున్నది. గతంలో మాదిరిగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.
కాంట్యిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) తో ప్రభుత్వానికి తలనొప్పులు మొదలయ్యాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వాన్ని నాలుగువైపులా దిగ్భందనం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. వచ్చే నెల ఒకటిలోగా సీపీఎస్పై సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. మున్ముందు మరిన్ని తీవ్రమైన ఆందోళనలు చేపట్టి ప్రభుత్వం దిగొచ్చేలా చేస్తామని వారు చెప్తున్నారు.
దాంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్న ప్రభుత్వం.. సీపీఎస్పై చర్చించేందుకు నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలతోపాటు సీపీఎస్కు చెందిన ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో సంప్రదింపుల కమిటీతో సమావేశానికి రావాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం అందింది. సచివాలయం రెండో బ్లాక్లోని ఆర్థికశాఖ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశం జరగనున్నది. సెప్టెంబర్ 1న సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించడంతో అత్యవసరంగా సీపీఎస్ రద్దు అంశంపై ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా భావిస్తున్నారు.