అఅమరావతి : వాలంటీర్ల వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) పై కేసులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు గ్రామవార్డు, వాలంటీర్లు, సచివాలయాల శాఖ సీపీసీ 199/ 4 ప్రకారం కేసుల నమోదుకు అనుమతిస్తూ ఉత్తర్వులు (Order ) జారీ చేసింది. ఈనెల 9న ఏలూరులో జరిగిన వారాహి యాత్ర బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి చేరవేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అతడిపై పరువు నష్టం కేసులు ( Defamation cases ) పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సర్కార్ సూచించింది. కాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై పవన్ కల్యాణ్ స్పందించారు. తనను విచారించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీ తమ కార్యాలయానికి చేరిందన్నారు. తనను అరెస్టు చేసినా, చిత్రవధలు పెట్టినా అన్నింటికీ తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. వాలంటీర్లు 23 అంశాల సమాచారం సేకరించి ఎక్కడికి పంపుతున్నారని ప్రశ్నించారు. సమాచార చౌర్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. సేకరించిన సమాచారం సర్వర్లో పెట్టుకున్నా నేరం కిందకు వస్తుందని అన్నారు .