విశాఖ: ఆంధ్రప్రదేశ్ సర్కార్పై బీజేపీ నేత పురందేశ్వరి ఘాటైన విమర్శలు చేశారు. కార్యకర్తలను ఉత్సాహపరచడంలో భాగంగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఏపీ సర్కార్కు అప్పులు చేయడంపై ధ్యాస ఉన్నదని దుయ్యబట్టారు. కేంద్రం నిధులను ఆపేస్తే ఇక్కడ పరిస్థితేంటని ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఆదివారం ఉదయం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఈ మేరకు పురందేశ్వరి ఈ కామెంట్లు చేశారు.
రాష్ట్రానికి పెద్ద మొత్తంలో అప్పు ఉన్నదని, అదే సమయంలో రాబడి లోటు ఉన్నదని పురందేశ్వరి చెప్పారు. అయితే, ఏ విధంగా రాబడి పెంచుకోవాలన్న దానిపై జగన్ సర్కార్ దృష్టిసారించడం లేదని, వారి ధ్యాస అంతా అప్పులు చేయడంపైనే అని విమర్శించారు. ఎక్కడ అప్పులు పుడతాయో అని ఆలోచిస్తున్న ప్రభుత్వం.. రాష్ట్రం అభివృద్ధిపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు. ఇవాళ కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశాలు రాష్ట్రంలో లేవని చెప్పిన పురందేశ్వరి.. ఇక్కడి దౌర్జన్యాల కారణంగా పెట్టుబడిదారులు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఇప్పుడున్న స్థితుల్లో గుప్పెడు మట్టిని కూడా రోడ్లపై వేసే పరిస్థితి లేదని.. రాష్ట్రానికి మంచి దిక్కు అవసరమంటూ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నదా? లేదా? అన్న ప్రశ్నకు జగన్ సర్కార్ సమాధానమివ్వాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేయమని భావించినట్లయితే ఇక్కడ అభివృద్ధి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను అత్యధిక స్థాయిలో దారి మళ్లిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది ఆంధ్రప్రదేశే అని.. ఈ విషయమై కాగ్ కూడా స్పష్టం చేసిందని ఆమె గుర్తుచేశారు.