Sankranthi Holidays | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెల 22వ తేదీన సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 11వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే దీనిపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో కనీసం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చేవారని.. ఇప్పుడు మారిన పరిస్థితులరీత్యా సెలవులు తగ్గించడం సరికాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు నిర్ణయించింది. 19వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని పేర్కొంది. అయితే పండుగ అయిపోయన వెంటనే పిల్లలు పాఠశాలకు రాలేరని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు రావడంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ.. తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.