అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ధార్మిక పరిషత్ ఏర్పాటైంది. ధార్మిక పరిషత్ను నెలకొల్పుతూ జగన్ సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిషత్లో మొత్తం 21 మంది సభ్యులుగా ఉండనున్నారు. ఈ కొత్త పరిషత్ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేండ్ల పాటు కొనసాగుతుంది. రెండేండ్ల క్రితం తమను ధార్మిక పరిషత్ నుంచి తొలగించడంపై తిరుపతి హథీరాంజీ మఠాధిపతి హైకోర్టును ఆశ్రయించడంతో పూర్తి స్థాయి ధార్మిక పరిషత్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. రూ.25 లక్షల నుంచి రూ. కోటి పైన ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకవర్గాల నియామకం ఈ పరిషత్ ద్వారా జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసింది. పరిషత్ చైర్మన్గా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, మఠాలు, సత్రాలు, ఇతర హిందూ ధార్మిక సంస్థల వ్యవహారాలపై ప్రభుత్వ పరంగా తీసుకొనే విధాన నిర్ణయాల్లో ఈ పరిషత్ కీలకంగా వ్యవహిరిస్తుంది. ఈ పరిషత్లో ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, ఓ రిటైర్డు హైకోర్టు జడ్జి, ఓ రిటైర్డు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక రిటైర్డు దేవదాయ శాఖ అధికారితో పాటు ఇద్దరు దాతలు, వివిధ ఆలయాల పాలక మండళ్ల చైర్మన్లు ఆరుగురిని సభ్యులుగా నియమించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈఓ సభ్యులుగా కొనసాగగా.. దేవదాయ శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు.
ఈ ధార్మిక పరిషత్లో తిరుమలలోని పెద్ద జియ్యంగార్ మఠం, కడప జిల్లాలోని పుష్పగిరి మఠంకు అవకాశం కల్పించారు. ఆగమ పండితులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు, సీహెచ్ శ్రీరామ శర్మకు పరిషత్లో స్థానం కల్పించారు. అలాగే, శ్రీరామమూర్తి (సీఏ), ఏబీ కృష్ణారెడ్డి (దేవదాయ శాఖ రిటైర్డ్ అధికారి) దాతలు ఎస్ నరసింహారావు, యూకే విశ్వనాథ్రాజు, ఎం రామకుమార్ రాజు (భీమవరం జగన్నాథరాజు సత్రం), చక్కా ప్రభాకరరావు (పాలకొల్లు చాకా వారి సత్రం), జ్వాలా చైతన్య (కడప యడ్ల పిచ్చయ్య శెట్టి సత్రం), ఇనుగంటి వెంకట రోహిత్ (అన్నవరం), మాక్కా బాలాజీ, రంజన్ సుభాషిణిలకు కూడా పరిషత్లో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.