AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను అటాచ్ చేయడానికి ఆమోదం తెలిపింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో స్థిర, చర ఆస్తులను చెవిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిందని సిట్ గుర్తించింది. రిజిస్ట్రేషన్ విలువను తక్కువగా చూపించి, పెద్ద మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్మనీగా మార్చినట్లు వెల్లడించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు అలాగే నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరుతో పాటు చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ రికార్డులు ఉన్నట్లుగా సిట్ పేర్కొంది. అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా జరిగిన 263.28 ఎకరాల భూమి కొనుగోలు – అమ్మకాల్లో భారీ మోసం జరిగిందని సిట్ తేల్చింది.
ఆ సమయంలో భూమి విలువలు అప్రత్యక్షంగా పెంచి, పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని వైట్గా మార్చినట్లు నిర్ధారించింది. ఈ ఒక్క లావాదేవీ ద్వారానే కేవీఎస్ ఇన్ఫ్రా రూ.13.3 కోట్ల బ్లాక్ మనీని వైట్ మార్చిందని సిట్ నివేదిక తెలిపింది. ఈ దర్యాప్తు నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం ఆస్తుల ఆటాచ్కు అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని సిట్ కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆస్తుల ఆటాచ్ కోసం విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతినిచ్చింది. డీజీపీ తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులు జారీ చేశారు.