ఎన్టీఆర్ జిల్లా : తెలుగు కమెడియన్ పృథ్వీరాజ్కు విజయవాడ కోర్టు మొట్టికాయలు వేసింది. భార్యకు నెలనెలా భరణం ఇవ్వాల్సిందే అని ఆదేశించింది. కేసు దాఖలైనప్పటి నుంచి భరణం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నది. 2016 ఏప్రిల్ నుంచి భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు.
ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. భార్యకు ప్రతి నెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. నెలనెలా 10 వ తేదీన భరణం మొత్తం అందేలా చూడాలని తీర్పునిచ్చింది. విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ఈ ఆదేశాలు ఇచ్చారు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్తో 1984లో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని.. సెక్షన్ 498 ఏ గృహహింస చట్టం కింద శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే భరణం ఇప్పించాలని 2017 జనవరి 10 న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పెళ్లి తర్వాత సినిమాల్లో వేశాలంటూ తిరిగే పృథ్విరాజ్కు ఖర్చులన్నీ తమ ఇంటి వారే ఇచ్చారని.. అయినా ఇంకా డబ్బు తేవాలంటూ వేధించేవాడని, 2016 ఏప్రిల్ 5న ఇంటి నుంచి గెంటేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నట్లు పృథ్విరాజ్ భార్య శ్రీలక్ష్మి తన పిటిషన్లో ఆరోపించారు. ఆయనతో కలిసి ఉండటం తనకు సాధ్యం కావడం లేదని కోర్టుకు తెలిపింది. పృథ్వీరాజ్ సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారని కోర్టుకు తెలిపిన శ్రీలక్ష్మీ.. నెలనెలా ఆయన నుంచి రూ.10 లక్షల భరణం ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శ్రీలక్ష్మి పిటిషన్ను విచారించిన విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఈ మేరకు ప్రతి నెలా రూ.8 లక్షల భరణంను 10 వ తేదీలోగా చెల్లించాలని నటుడు పృథ్వీరాజ్ను ఆదేశించింది.