గుంటూరు: రాష్ట్రంలో ఏపీ ఈఏపీసెట్ 2022 ప్రారంభమైంది. తొలుత ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 సెషన్లలో ఈ నెల 8 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పరీక్ష జరుగనున్నది. మొత్తం 122 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేయడంతో ఉదయం 7 గంటల నుంచే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల వద్ద బారులుతీరారు. మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఏపీ ఈఏపీసెట్ నిర్వహిస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్ కోసం 3,00,084 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఉండదు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుని హాల్టికెట్తోపాటు ఫొటో గుర్తింపు కార్డులను తనిఖీ చేయించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. పరీక్షా కేంద్రాల వద్ద బాల్పెన్, రఫ్ పేపర్లు సరఫరా చేశారు. ఏపీ ఈఏపీసెట్-2022 కు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం అదనపు బస్సులను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది.
ఏపీ ఈఏపీసెట్ జూలై 4 నుంచి 8 వరకు 10 సెషన్లలో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే 08554-234311, 08554-232248 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.