ఏపీలో అసంతృప్త పర్వం ముగిసినట్లే కనిపిస్తోంది. ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు అధికార వైసీపీలో తీవ్ర రచ్చకు దారితీసింది. నూతన కేబినెట్లో బెర్త్ దక్కని నేతలు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, హోంశాఖ మాజీ మంత్రి సుచరిత, ఎమ్మెల్యే పార్థసారథి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సామినేని ఉదయభాను ముందు వరుసలో వున్నారు. మాజీ మంత్రి బాలినేని అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఆయన ఇంటికి రెండు సార్లు వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. అయినా… అసంతృప్తితోనే వున్నారు. చివరికి సీఎం జగన్తో భేటీ అయిన తర్వాత పూర్తిగా మెత్తబడ్డారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పజెప్పినా చేసేందుకు సిద్ధమని, వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ విధేయంగానే వుంటానని ప్రకటించారు.
ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కూడా కాస్త గట్టిగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా… ఆయన అనుచరులు మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ రహదారులపై టైర్లను తగలబెట్టి, నిరసన వ్యక్తం చేశారు. ఓ మహిళ పిన్నెల్లికి మంత్రి పదవి రాలేదని ఆత్మహత్యాయత్నం కూడా చేసుకోబోయింది. చివరికి వైసీపీ కార్యకర్తలే బుజ్జగించారు. పిన్నెల్లిని బుజ్జగించే బాధ్యతను వైసీపీ హైకమాండ్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పజెప్పింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ ముగిసిన తర్వాత పిన్నెల్లి, పెద్దిరెడ్డి ఇద్దరూ కలిసి సీఎం జగన్తో భేటీ అయ్యారు. సీఎం జగన్తో భేటీ తర్వాత పిన్నెల్లి మెత్తబడ్డారు. ఏ బాధ్యత అప్పజెప్పినా పనిచేస్తానని, తమ టార్గెట్ 2024 అంటూ చెప్పుకొచ్చారు.
ఇక… సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి కూడా ఇదే బాటలో పయనించారు. తమకు మంత్రి పదవి దక్కలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇద్దరూ సీఎం జగన్తో భేటీ అయ్యారు. భేటీ తర్వాత మెత్తబడ్డారు. తాము పార్టీ కోసం పనిచేస్తామని, ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తామని ప్రకటించారు. 2024 ఎన్నికలే తమ లక్ష్యమని, ఇందుకోసం పనిచేస్తామని ప్రకటించారు.
ఇక చివరగా హోంశాఖ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కూడా మెత్తబడ్డారు. తనకు మంత్రి పదవి దక్కలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్న వార్తలూ వచ్చాయి. ఆమెను బుజ్జగించేందుకు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణను పార్టీ రంగంలోకి దింపింది. ఈయన పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరికి సీఎం జగన్తో సుచరిత భేటీ అయ్యారు. భేటీ తర్వాత చల్లారారు. తాను పార్టీ కోసం పనిచేస్తానని, జగన్ వెంటే నడుస్తానని ప్రకటించారు.