అమరావతి : కేంద్రం విడుదల చేస్తున్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, నాయకుడు, టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం అంశాలను వారు వెల్లడించారు. గడిచిన రెండున్నర ఏండ్ల జగన్ ప్రభుత్వం రూ.లక్షా 40 వేల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. కేంద్రం నుంచి విడుదల అవుతున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, కేంద్రపథకాలకు ఇతరుల పేర్లను పెడుతూ వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర నిధులను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతామని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరస్పర దూషణలు తప్ప అభివృద్ధిపై దృష్టి లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలోని అవినీతి ప్రజలకు అర్థమైందని వారు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక, మట్కా, గుట్కా, గంజాయి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు.