Pawan Kalyan | పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు.
‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సాస్కి నిధులకు అనుమతుల స్టేటస్ గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా ఆమోదించారని, ఆర్థిక శాఖ నుంచి సమ్మతి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై తక్షణం ఆర్థిక శాఖతో చర్చించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలన్నారు. అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలన్నారు. ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయాలని సూచించారు. అధునాతన సాంకేతికత సాయంతో ఆ విధమైన వ్యవస్థకు రూపకల్పన చేయాలన్నారు. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలని ఆదేశించారు. ఒక వర్కింగ్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలన్నారు. ఈ అంశంలో అర్టీజీఎస్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. అడవి తల్లి బాటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని ఈ సిస్టంకు అనుసంధానించాలని సూచించారు. తద్వారా ఎప్పటికప్పుడు గిరిజన గ్రామాల్లో పనుల పరోగతిని పరిశీలించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఏ పని చేసినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.
” గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పక్కా ప్రణాళికతో అన్నింటినీ అధిగమించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ పథకం కింద వచ్చే నిధులతోపాటు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం సాయం మొత్తం కలిపి రూ.1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించాం. అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయండి. ఎక్కడైనా అటవీ శాఖతోగాని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణం పరిష్కరించి పనులు ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ” అని పవన్ కల్యాణ్ సూచించారు.
” పల్లె పండగ 2.0 కోసం సాస్కీ నిధులు వినియోగించుకోవడంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా కృషి చేయాలి. తక్షణం పల్లె పండగ 2.0ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెల్లో 4007 కిలోమీటర్ల మేర రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి” అని సూచించారు.
” పల్లెల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో జల్ జీవన్ మినష్ పనులు ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రస్తుతం చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి. నీటి నాణ్యత పక్కగా ఉండాలి. అదే అందరి ప్రధమ బాధ్యత కావాలి. నవంబర్ మూడో వారం నుంచి జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి సారించాలని నిర్ణయించాం. 17వ తేదీ తర్వాత క్షేత్ర స్థాయిలో పర్యటించి జల్ జీవన్ మిషన్ పనుల్లో పురోగతి, ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థల వద్ద నీటి నాణ్యతను స్వయంగా పరిశీలన చేస్తాను. గ్రామీణ ప్రజలకు అందించే మౌలిక వసతుల్లో రోడ్లు, తాగు నీటికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం.” అని అన్నారు.
” గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేసే విధంగా ముందుకు వెళ్లాలి. స్వమిత్వ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 613 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 5.18 లక్షల మందికి యాజమాన్య పత్రాలు అందించేందుకు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. రెండో విడత మరో 5,847 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి ఈ నెలాఖరుకి మరో 45.66 లక్షల మందికి వారి యాజమాన్య హక్కు పత్రాలు సిద్ధం చేస్తాం. డిసెంబర్ నుంచి మూడో విడత ప్రారంభించి మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు నిర్ధేశించాం. అందుకోసం సర్వే విభాగం గ్రామ సర్వేయర్ల సేవలను పంచాయతీరాజ్ శాఖకు కేటాయించే ఏర్పాటు చేయాలి. పంచాయతీరాజ్ శాఖ, సర్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు స్వమిత్వ సర్వేను నిరంతరం పర్యవేక్షించాలి. క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా స్వమిత్వ పథకం కింద నిర్వహిస్తున్న సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల అభిప్రాయం సేకరిస్తాం. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీ సర్వే, గత ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన పాసు పుస్తకాల కారణంగా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. మన ప్రభుత్వంలో అలాంటి తప్పులకు తావుండదు. రీ సర్వే తర్వాత ఎవరి భూములు వారికి అప్పగిస్తూ ప్రాపర్టీ కార్డులు ఇస్తాం. రాజ ముద్రతో కూడిన కార్డులు అందిస్తాం. ఈ ప్రాపర్టీ కార్డులు వచ్చిన తర్వాత ఆయా స్థలాలు అమ్ముకునేందుకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుంది” అని అన్నారు.