Pawan Kalyan | జనసేన కార్యకర్తలకు, నాయకులకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.సోషల్మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా నాయకులు స్పందించినా సరే.. ఎవరూ ప్రతిస్పందించవద్దని సూచించారు. ఈ మేరకు జనసైనికులకు పవన్ కల్యాణ్ సుదీర్ఘ లేఖ రాశారు.
పవన్ కల్యాణ్ రాసిన లేఖ యదాతథంగా..
ప్రియమైన జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం,
2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ – టీడీపీ – బీజేపీ NDA కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు.. గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫ్యల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో, కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164/175 స్థానాలను NDA కూటమికి, 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్ధులను గెలిపించారు. కట్టబెట్టారు.
ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నా, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమాన్ని – అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నా సరే దానంతటికి కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే ధృఢ సంకల్పమే కారణం.
ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే, దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి, వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పని చేస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన అవసరం ఉంది.
నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను, నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం, నేను పుట్టిన నేలను అభివృద్ది చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మార్చి 14 న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్షా గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను.
మీ
పవన్ కల్యాణ్