Pawan Kalyan | అడవులు జాతీయ ఆస్తి, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయాలకు తావుండదని.. రాజీకి తావుండదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని NDMA ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల రెండు రోజుల వర్క్ షాప్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవులు జాతి సంపద అని, ప్రతి అంగుళం అమూల్యమైనదని తెలిపారు.
అడవుల రక్షణ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకం చేస్తున్నారని పవన్ కల్యా్ణ్ అన్నారు. అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలోని అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకుంటే, నాడు అధికారులు ఎందుకు స్పందించలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. అలాంటి తప్పిదాలు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదని, పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కబ్జా అయినా వేగంగా స్పందించాల్సిన బాధ్యతను అటవీ అధికారులు తీసుకోవాలని చెప్పారు.

ఎన్ఐఆర్డీలోని నక్షత్ర వనాన్ని పరిశీలించి, జమ్మి చెట్టు నాటిన పవన్ కల్యాణ్
అటవీ శాఖలో విభిన్నమైన బాధ్యతలు పంచుకోవడానికి సరిపడినంత సిబ్బంది లేరని ప్రతి సమీక్షలోనూ అధికారులు నా దృష్టికి తీసుకువస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమస్య అధిగమించడానికి ఉన్న మార్గాలను కేబినెట్ ముందు ఉంచామన్నారు. సిబ్బంది నియామకం వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శకత పాటించాలని సూచించారు. ఎలాంటి సిఫార్సులకు తావివ్వవదన్నారు. అడవుల్ని సంరక్షించాలంటే అటవీ శాఖ అధికారుల భద్రత ప్రధానమైనదని తెలిపారు. అటవీ సిబ్బంది భద్రత పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో ఉందన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఇబ్బందిపెట్టినా, దాడులకు పాల్పడినా అది ఏ స్థాయి వ్యక్తులైనా వారిని ఉపేక్షించమని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉంటే వ్యక్తిగతంగా తనను కలిసి సమస్యను చెప్పాలని కోరారు. శ్రీశైలం ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకున్నానని అన్నారు. సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చూశామని తెలిపారు. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి భయాలకు తావివ్వవద్దని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం భూ భాగంలో నోటిఫై చేసిన అడవులు ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. డి-నోటిఫై చేసిన దానితో కలిపితే మొత్తం 31 శాతంగా ఉండవచ్చు అని అంచనా.. అయితే ఉన్న అడవుల్లో ఎంత పచ్చదనం ఉంది? ఆక్రమణల నేపథ్యంలో ఎంత శాతం అడవులు మిగిలాయి అన్నది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. దీనిపై సమగ్ర సర్వే చేసి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా, చేసింది ఎవరైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. 2047 నాటికి రాష్ట్ర భూ భాగంలో 50 శాతం పచ్చదనంతో నిండేలా పని చేయాలన్నారు. దీనికి ప్రజల భాగస్వామ్యం అవసరమని.. భావితరాలకు పచ్చదనాన్ని పెంపొందించేలా చైతన్యవంతులను చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు.

మానవులు – జంతువుల సంఘర్షణను అరికట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అయిన చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మదపుటేనుగుల సంచారం ఎక్కువగా ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో సమస్య పరిష్కారానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చామని తెలిపారు. శ్రీకాకుళంలో తొమ్మిది ఆడ ఏనుగులు సంచరిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. ఇవి ఒడిశా నుంచి వచ్చాయని.. ఒడిశాలో మైనింగ్ పెరిగిపోవడంతో అవి ఇటు వైపు వలస వచ్చినట్టు తెలుస్తోందన్నారు. మన రాష్ట్రంలో అవి తిరుగుతున్న ప్రాంతం మొత్తం పంట పొలాలున్న ప్రాంతమని.. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైతే ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి వాటిని తిరిగి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అడవుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, గిరిజనుల కోసం ఏదైనా చేయాలన్న తపన, నిబద్దతతో పని చేయాలని ముందుకు వచ్చే అధికారులకు కూటమి ప్రభుత్వం తరఫున మావంతు సహకారం అందిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. అడవులను కాపాడుకుంటూ, జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకుంటూ పచ్చని హరితాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం” అన్నారు.