ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కాకపోతే… శాశ్వతంగా రాజకీయాల నుంచి తమ కుటుంబం తప్పుకుంటుందని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్ విసురుతున్నానని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారని, ఆ లోపు మేం గాజులు తొడుక్కుంటామా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు కామెంట్లకు వైసీపీ నేతలు భయపడాల్సిన అవసరమే లేదని అన్నారు.
రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదని, వచ్చే సారి కూడా వైసీపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు మరింత పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలను ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు ఏది కావాలన్నా… దాన్ని చేయడానికి రెడీగా ఉన్నామని, టీడీపీ నేతల మాటలు మాత్రం నమ్మి మోసపోవద్దన్నారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరస్తానని, ఒకవేళ నెరవేర్చకపోతే… వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ధర్మాన ప్రకటించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న పాలన, ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఓర్వలేకే టీడీపీ లేని పోని ప్రచారాలు చేస్తోందని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.