అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం కొలిక్కిరానున్నది. టికెట్లను చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నది. ఈ సమావేశంలో టికెట్ల డ్రాఫ్ట్ రికమండేషన్లపై చర్చించనున్నారు. ఇప్పుడున్న 3 క్లాసులకు బదులుగా రెండింటినే తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే డీలెక్స్ క్యాటగిరి కనుమరుగవుతుందని సినిమా ప్రియులు అంటున్నారు.
సినిమా టికెట్ల ధరల వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల సీఎం జగన్తో సినిమా నటులు భేటీ అయిన తర్వాత టికెట్ల కమిటీ కూర్చొని చర్చించాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే డ్రాఫ్ట్ రికమండేషన్లు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. భౌగోళిక క్యాటగిరిలో 35 జీఓ ప్రకారం 4 ప్రాంతాలను 3గా, గ్రామ, నగర పంచాయతీలను కలిపి నగర పంచాయతీ ఏరియాగా చేసిన సిఫార్సులపై రేపు చర్చించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో టికెట్ క్లాసుల్లోనూ సవరణలకు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు ఉన్న 3 క్లాసులకు బదులుగా 2 క్లాసులను తీసుకొచ్చేందుకు రికమండేషన్ చేసినట్లు తెలుస్తున్నది. అన్ని థియేటర్లలో ఎకానమీ, ప్రీమియం క్లాసులనే సిఫార్సు చేసినట్లుగా సమాచారం. ఇదే గనక అమల్లోకి వస్తే.. రానున్న రోజుల్లో డీలెక్స్ క్యాటగిరి కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తున్నది. మొత్తం సీట్లలో 40 శాతం సీట్లు ఎకానమీ క్లాసుకు కేటాయించి మిగతా సీట్లను ప్రీమియం క్యాటగిరీ కింద పెట్టాలని భావిస్తున్నారు. అదేవిధంగా సినిమా థియేటర్ల టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.