అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీకేజీపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని పరిశ్రమల శాఖ మంత్రిని ఆదేశించారు.
ఇవాళ మధ్యాహ్నం సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీకేజీ కావడంతో అందులో పని చేసే కార్మికులతో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న మరికొన్ని యూనిట్లలో పనిచేస్తున్న పదుల సంఖ్యలోని కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. లీకైన అమ్మోనియా వాయువును పీల్చడంతో వాంతులు, తల తిరగడం, కళ్ల మంటల భయంతో సీడ్ కంపెనీ ఉద్యోగులు పరుగులు తీశారు.దీంతో బాధితులను సెజ్ యాజమాన్యం హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని మంత్రి అమర్నాథ్ తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మెరగైన వైద్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
లీకేజీకి గల కారణాలను కాలుష్య నియంత్రణ అధికారులు తెలుసుకుంటున్నారు. గ్యాస్ లీకేజీ ఘటన తరువాత బ్రాండిక్స్ యాజమాన్యం రెండో షిఫ్ట్ రద్దుచేసి ఉద్యోగులను ఇళ్లకు పంపారు.