న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 12 వైద్య కళాశాలను మంజూరు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యతో సమావేశమై ఈ మేరకు విజ్ఞాపనపత్రం అందజేశారు. కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమైనందున 12 జిల్లాల్లో 12 వైద్య కళాశాలలను త్వరగా మంజూరు చేయాలని కోరారు.
వచ్చే ఏడాది డిసెంబర్ లోగా కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లయితే 2024 అకడమిక్ సెషన్ నుంచి ప్రవేశాలు జరుపవచ్చునని కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా తమ రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఏపీ ప్రజలకు ప్రత్యేక వైద్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయని వెల్లడించారు. కీలక వైద్య చికిత్సల కోసం పొరుగున ఉన్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజావైద్యరంగాన్ని పటిష్ఠం చేసేందుకు ప్రైమరీ, సెకండరీ సేవలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సేవలు అందించేలా మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండేవని, పరిపాలనను మరింత దగ్గర చేసేందుకు తమ ప్రభుత్వం మరో 13 జిల్లాలను సృష్టించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా)లో ఒక్కొక్కటి చొప్పున 2020 మార్చి 20న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ మూడు కాలేజీల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా 12 జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.