ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన, టీడీపీపై ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రైతులకు విపరీతమైన ఇబ్బందులు వచ్చాయని, ఆ సమయంలో దుష్ట చతుష్టయం బాబును ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రశ్నించాల్సిన సమయంలో దత్తపుత్రుడు విపరీతమైన ప్రేమను ఒలకబోశారని విమర్శించారు.
ఏలూరులో జరిగిన సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల పరామర్శ యాత్ర అంటూ దత్తపుత్రుడు బయల్దేరారని పవన్ను దెప్పిపొడిచారు. పట్టాపాసుదారు పుస్తకం ఉండి, ఆత్మహత్య చేసుకున్న రైతుకు నష్టపరిహారం అందని కుటుంబాలను చూపించలేకపోయారని విమర్శించారు. ఇవ్వాళ వీరంతా మొసలి కన్నీరు కారుస్తున్నారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు.
తనకు ఓటు వేసినా, వేయకపోయినా… అందరికీ మంచి చేయాలన్నదే తమ సర్కార్ ఉద్దేశమని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి ఉన్న ప్రధాన ఇదేనంటూ జగన్ చెప్పుకొచ్చారు. వ్యవసాయమే దండగ అన్న నేత.. ఇప్పుడు రైతులపై తెగ ప్రేమ ఒలకబోస్తున్నారని, రైతు గురించి మాట్లాడే అర్హత బాబుకు వుందా? అంటూ ప్రశ్నించారు.
రైతులకు మేలు చేయాలంటే రైతు సంస్కృతి, రైతు జీవన విధానం బాగా ఆకళింపు చేసుకొని వుండాలని సీఎం జగన్ అన్నారు. రైతులపై ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వాలను మనం గతంలో చూశామని ఎద్దేవా చేశారు. రైతులపై కాల్పులు కూడా జరిపిన ప్రభుత్వాలు గతంలో వుండేవని, వీటి గురించి దత్తపుత్రుడు ఏనాడైనా అడిగారా? అంటూ పవన్పై సీఎం జగన్ మండిపడ్డారు.