మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో మత్స్యకారులను పట్టించుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గత పాలనకు, తమ పాలనకు మధ్య వున్న వ్యత్యాసాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కోనసీమ జిల్లాలోని ఐ. పోలవరం మండలం మురముళ్ల గ్రామంలో జగన్ పర్యటించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ మత్స్యభరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం కింద ఈ ఏడాది 1,08,755 మంద మత్స్యకారుల ఖాతాల్లోకి 109 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే పథకం కింద ఇప్పటి వరకు 418 కోట్లను సాయంగా ఇచ్చామని తెలిపారు.
మాజీ సీఎం చంద్రబాబు ఐదేళ్ల పదవీ కాలంలో మత్స్యకారులకు కేవలం 104 కోట్లే ఇచ్చారని, కానీ తమ ప్రభుత్వం 109 కోట్ల ఇస్తోందని సీఎం తెలిపారు. వేటకు వెళ్లి, ప్రమాద వశాత్తు మత్స్యకారులు మరణిస్తే, పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు చేశామని గుర్తు చేశారు. ఏపీలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
మత్స్యకారుల కష్టాలను పాదయాత్ర సందర్భంగా దగ్గరి నుంచి చూశానని, అందుకే వరుసగా నాలుగో ఏడాది కూడా మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. వేట కోల్పోయిన 23 వేల మత్స్యకారులకు ఓఎన్జీసీ పరిహారం ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.