Chandrababu | వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులు తిరుమలకు అడుగుపెట్టినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీటీడీ సహా కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇస్తారా? ఇవ్వరా? అనేది సందిగ్ధంగా మారింది. ఇలాంటి సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్ (ఎక్స్) చేశారు.
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమని తెలిపారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారని చెప్పారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు.