Chandrababu | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడును అవినీతి కేసులో ఏపీ సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో సాయంత్రానికి విజయవాడకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకు సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగింది. సీఐడీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయనను ప్రవేశపెడతారని భావించినా.. రాత్రి వరకు విచారణ కొనసాగించారు. ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వెలుగుచూసిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణంలో చంద్రబాబు నిందితుడిగా ఉన్నట్టు తేలిందని చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 2014లో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందని, తర్వాత నకిలీ ఒప్పందాలు, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని డొల్ల కంపెనీలకు మళ్లించారని పేర్కొన్నారు. అనేక కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు అనంతరం చంద్రబాబు ప్రధాన నిందితుడిగా తేలడంతో ఆయనను అరెస్టు చేశామని చెప్పారు. ఈ స్కాంలో రూ.371 కోట్లు చేతులు మారాయని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్తో ఏపీలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ అభిమానులు పోస్టుల వర్షం కురిపించారు. వైసీపీ మద్దతుదారులు ‘కరప్షన్ కింగ్ సీబీఎన్’, ‘స్కామ్ స్టార్ చంద్రబాబు’ హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేశారు. టీడీపీ మద్దతుదారులు సైకో సీఎం అనే హ్యాష్ట్యాగ్తో పోస్టులు పెట్టారు.