గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును (MLC Ashok babu) ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని అశోక్బాపుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు.
అశోక్బాబుపైన సెక్షన్ 477A, 465, 420 కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి అశోక్ బాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అశోక్బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు.
కాగా, అశోక్ బాబు అరెస్టును టీడీపీ అధిష్టానం స్పందించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయించిందని విమర్శించింది. ఒక ప్రజాప్రతినిధిని రాత్రిపూట ఎలా అరెస్ట్ చేస్తారని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుకు తప్పక మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.