అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దాదాపు 7రోజులు, 35 గంటల పాటు కొనసాగిన సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులపై ప్రభుత్వం చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, వైసీపీ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లును ఉపసంహరించుకోవడం సంచలనం కలిగించింది.
దీంతో పాటు సభలో తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షనేత చంద్రబాబు బోరున విలపించిన అంశం కూడా ఏపీ రాజకీయ వ్యవస్థలో సంచలనం రేపింది. ఈ సందర్భంగా శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డ అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వర్షకాల సమావేశంలో కీలక బిల్లులపై చర్చ జరిపామని, 28 బిల్లులకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు ఆడి దిగ జారారని ఆరోపించారు. వరదలు, సహయక చర్యలపై సభలో వివరంగా చర్చించామని పేర్కొన్నారు.