AP SSC Student : పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు వింతవింత సమాధానాలు రాస్తుంటారు. కొందరు పాస్ చేయండని అభ్యర్థిస్తే, మరికొందరు తమ కుంటుంబ పరిస్థితిని వివరిస్తారు. ఇంకొందరు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఆ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ జవాబు పత్రం మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయురాలు షాకయ్యింది.
ఎందుకంటే.. ‘నాకు మంచి మార్కులు వేయకపోతే మా తాతతో చెప్పి చేతబడి చేయిస్తా’ అని విద్యార్థి ఆ జవాబు పత్రంలో రాశాడు. దాంతో ఆ విషయాన్ని సదరు ఉపాధ్యాయురాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం సందర్భంగా ఈ వింత వెలుగుచూసింది.
తెలుగు పరీక్షలో ‘రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి’ అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సరైన సమాధానం రాయలేకపోయిన విద్యార్థి.. ‘మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. అయితే ఆ ప్రశ్నకు మినహా మిగతా ప్రశ్నలకు సదరు విద్యార్థి జవాబులు సరిగానే రాశాడు. తెలుగు పేపర్ మొత్తంలో అతనికి 70 మార్కులు వచ్చాయి. అయితే ఎక్కువ మార్కులు రావాలనే ఉద్దేశంలో విద్యార్థి ఈ పని చేసినట్లు తెలుస్తోంది.