అమరావతి : ఏపీలో అధికార వైసీపీ(YCP) ని వీడి ఇప్పటికే పలు పార్టీలో చేరిన వారి వరుసలో మరో ఎమ్మెల్సీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే పార్టీని వీడవద్దని వైసీపీకి చెందిన కీలక నేతలు బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపు కోట( Sringavarapu Kota) నియోజకవర్గంలో నాన్ లోకల్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ఈ సారి ఎన్నికల్లోనూ అవకాశం ఇస్తుండడంతో స్థానికుడైన ఎమ్మెల్సీ రఘురాజు (Raghuraju) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మొదటిసారి టికెట్ ఇచ్చినపుడు సర్దుకుపోయి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పనిచేసి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో రఘురాజుకు ఎమ్మె్ల్సీ పదవిని ఇచ్చారు. రెండోసారి కూడా సిట్టింగ్ అవకాశం ఇస్తుండడంతో రఘురాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని, తానేంటో, తన రాజకీయం అంటే ఏంటో చూపిస్తానని అధిష్టానాన్ని పరోక్షంగా హెచ్చరించారు.
ఇందులో భాగంగా రఘురాజు తన సతీమణి సుధారాణి (Sudharani) తో పాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీలను, సర్పంచులను, మరికొంత మంది వైసీపీ నాయకులను అమరావతికి పంపి టీడీపీలో చేరాలని పురామయించారు. వారంతా సోమవారం సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్( Nara Lokesh) సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన కీలక నేతలు ఎమ్మెల్సీ రఘురాజును బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తనకే టికెట్ ఇవ్వాలని రఘురాజు పట్టుబడుతున్నారు.