విశాఖపట్నం: ఈ నెల 20 వ తేదీ నాటికల్లా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నదని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలని అధికారులు సూచన జారీ చేశారు.
ఎగువ వాయుగుండం ఏర్పడుతుందని, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతిలోని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ కరుణసాగర్ తెలిపారు.దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అయితే, ఈ వర్షాల తీవ్రత మరో 24 గంటల్లో వెల్లడవుతుందని డాక్టర్ కరుణసాగర్ తెలిపారు.
ఇలాఉండగా, ప్రైవేట్ వెబ్సైట్ స్కైమెట్ నివేదిక ప్రకారం, దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వాన కురిసే అవకాశం లేదు. ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, కేరళలో రానున్న రోజుల్లో అతి తక్కువ వర్షాలు కురుస్తాయి. వర్షపాతం స్వల్పంగానే ఉంటుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కొంత పెరుగవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని నివేదిక పేర్కొంది.