హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మరో తుఫాన్ సంభవించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లో ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతున్నది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చలిపులి వణికిస్తున్నది. పొగ మంచు కమ్మేస్తున్నది. మిగ్జాం తుఫాన్ తర్వాత ఈ శీతల వాతావరణం మరింత పెరిగింది.