అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ ఐక్య కార్యచరణ సమితి ప్రతినిధులు విశాఖలో క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 91వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కేసీఆర్కు వారు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని వారు కోరారు. ఈ రోజు జరిగిన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
వీటితో పాటు 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది.