తిరుపతి : తిరుపతిలోని నారాయణవనం చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavam) జూన్ 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జూన్ 18 సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని వివరించారు. జూన్ 19న ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ(Vahana Seva) నిర్వహించనున్నట్లు వివరించారు.
ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం(Tirumanjanam), రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. 20న సింహ వాహనం(Simhavahanam), 21న హంస వాహనం, 22న శేష వాహనం, 23న నంది వాహనం, జూన్ 24న గజ వాహనాలపై స్వామివారు ఊరేగుతున్నారని వివరించారు. 25వ తేదీన రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
26 రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం(Kalyanotsavam), అశ్వ వాహనసేవ నిర్వహించనున్నారు. జూన్ 27న ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు నటరాజస్వామివారి ఉత్సవం, సాయంత్రం రావణేశ్వర వాహనసేవ, 28న ఉదయం త్రిశూలస్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.