Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నామని ఈవో లవన్న తెలిపారు. ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం సందర్బంగా గురువారం రాత్రి పది గంటల నుండి గర్బాలయంలో మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు.
స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు, షోడశోపచార ప్రత్యేక పూజలు, రుద్ర నమక చమకాలతో అర్చక వేదపండితులు మంత్రాలు పఠిస్తూ మహన్యాసపూర్వక లింగోద్బవ రుద్రాభిషేకం, అన్నాభిషేకం జరిపించారు. వివిధ రకాల పుష్పాలు, ఫలాలను నేవేద్యంగా సమర్పించారు. కాగా, వార్షిక ఆరుద్రోత్సవం రోజున మల్లన్నను దర్శించుకునేందుకు యాత్రికులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు.
వృద్ధ మల్లికార్జున స్వామికి బిల్వార్చన అభిషేక పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రాత:కాల పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనసేవలో ఉరేగిస్తూ గ్రామోత్సవం జరిపించనున్నట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశం అన్ని విధాలుగా సుభిక్షంగా ఉండాలని ప్రధానార్చకులు మహా సంకల్పం పఠిస్తారు.
శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న గో సంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళం ఇచ్చారు. గురువారం హైదరాబాద్ వాసి టీ వెంకట గిరిధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రూ. లక్ష డీడీని ఆలయ పీఆర్వో శ్రీనివాసరావుకు అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.