తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగాసేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు . యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు ఇవాళ్టి నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటామని వివరించారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఆదివారం యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, జూలై 25న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జూలై 26న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, అధికారులు పాల్గొన్నారు.