ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సచివాలయంలో వింత దృశ్యం కనిపించింది. భేటీలో సీఎం జగన్ ఆదేశానుసారం మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించిన 24 మంది.. సచివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ కాన్వాయ్లలో తిరిగి వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం కేబినెట్భేటీలో పలు కీలక అంశాలపై నేతలంతా చర్చించారు.
అనంతరం తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన మంత్రులు.. కాన్వాయ్లను సచివాయలంలోనే వదిలేసి వెళ్లిపోయారు. వీళ్లంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్కు సమర్పించి వెనుతిరిగారు. అనంతరం మంత్రి హోదాలో తమకు ప్రభుత్వం కల్పించిన అధికారిక కాన్వాయ్లను అక్కడే వదిలేశారు. సొంత వాహనాల్లో ఇళ్లకు వెళ్లిపోయారు.
అంతేకాదు, కేబినెట్ భేటీకి ముందే తమతమ ఛాంబర్లను కూడా మంత్రులు ఖాళీ చేసినట్లు సమాచారం. కాగా, పాత మంత్రి వర్గంలోని కేవలం ఐదారుగురు నేతలకే కొత్త మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి రాజీనామాలు చేసిన వారిలో ఎవరికి ఈ పదవులు దక్కుతాయో చూడాలి.