విశాఖపట్నం: వచ్చే నెల 6 వ తేదీ నుంచి మినీ ఐపీఎల్ కు సర్వం సిద్ధమైంది. మినీ ఐపీఎల్గా భావించే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆటగాళ్ల వేలం రేపటి నుంచి మొదలవుతుంది. గురువారం జరిగిన ఒక సమావేశంలో ఫ్రాంచైజీ లోగోలను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆవిష్కరించింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ జూలై 6 నుంచి 17 వరకు కొనసాగనున్నది.
ఏపీఎల్ మొదటి ఎడిషన్ కోసం ఆరు ఫ్రాంచైజీలు ఎంపికయ్యాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకారం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు 27 ఫ్రాంచైజీ ఎంట్రీలు వచ్చాయి. తొమ్మిదింటిని షార్ట్లిస్ట్ చేయగా.. ఆరు ఫ్రాంచైజీలు బిడ్ను గెలుచుకున్నాయి. ప్రతి జట్టులో 20 మంది ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బంది ఉంటారు. ఏపీఎల్ అధికారిక స్పాన్సర్గా శ్రీరామ్ గ్రూప్ వ్యవహరిస్తున్నది. జూన్ 24న జరిగే వేలంలో డజన్ల కొద్దీ ఆటగాళ్లు బరిలోకి దిగుతారని, ఆరు జట్లలో ఒక్కో జట్టు 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చని ఏసీఏ సీఈవో శివారెడ్డి తెలిపారు. జూలై 17న జరిగే టైటిల్ మ్యాచ్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏపీఎల్ లో పాల్గొనే జట్లు:
1. ఉత్తర ఆంధ్ర లయన్స్
2. రాయలసీమ రాజులు
3. గోదావరి టైటాన్స్
4. కోస్టల్ రైడర్స్
5. బెజవాడ టైగర్స్
6. వైజాగ్ వారియర్స్
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ట్వంటీ 20 టోర్నమెంట్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏసీఏకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ 20 టోర్నమెంట్ తరహాలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను నిర్వహించడానికి తమిళనాడు, కర్ణాటక, సౌరాష్ట్రలకు ఇండియన్ క్రికెట్ బోర్డు అనుమతించిన విషయం తెలిసిందే.