అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ఇటీవల నమోదైన రోజువారి కేసులతో పోల్చితే ఇవాళ భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,440 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన చేసింది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 46,650 శాంపిళ్లను పరీక్షించగా అందులో 14,440 శాంపిళ్లలో వైరస్ ఉన్నట్లు తేలిందని ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 32 శాతం నమోదైంది. ఇక కొత్తగా 3,969 మంది మహమ్మారి బారి నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 83,610 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,80,634కు చేరింది.
అందులో 20,82,482 మంది కరోనాను జయించి క్షేమంగా బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నలుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 14,542కు పెరిగింది. ఇవాళ్టి కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. అక్కడ మొత్తం 2,258 మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత అనంతపురంలో 1,534, గుంటూరులో 1,458, ప్రకాశంలో 1,399, కర్నూలులో 1,238, చిత్తూరులో 1,198, నెల్లూరులో 1,103, తూర్పుగోదావరిలో 1,012 కరోనా కేసులు బయటపడ్డాయి.