తిరుపతి : జీవన విధానంలో ఎదురయ్యే ఆరోగ్య ఇబ్బందులను గుర్తించి వాటిపట్ల అవగాహన కల్పించుకుంటే జబ్బుల నుంచి రక్షణ కల్పించుకోవచ్చని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అన్నారు. టీటీడీ పురుష ఉద్యోగులకు మూడు రోజుల పాటు నిర్వహించే జీవనశైలి రుగ్మతలపై శనివారం మహతి ఆడిటోరియంలో అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థూలకాయం వల్ల షుగర్, గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రోజుకు 8 గంటల నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం లాంటి అలవాట్లతో వ్యాధులు రాకుండా నివారించవచ్చునన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థకు కూడా మంచి సేవలు అందించగలుగుతారని ఈవో చెప్పారు. జబ్బుల లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రజలు అనేక వ్యాధులతో బాధ పడుతున్నారని అన్నారు. ప్రముఖ వైద్య నిపుణులతో నిర్వహించే అవగాహన కార్యక్రమం వల్ల ఉద్యోగులకు ఎంతో ఉపయోగం ఉంటుందని అభిప్రాయ పడ్డారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి,శ్వేత డైరెక్టర్ ప్రశాంతి శ్వేత తదితరులు పాల్గొన్నారు.