అమరావతి: భారత తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్తోపాటు హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ వాసి, లాన్స్నాయక్ సాయితేజ ( Lance Naik B Sai Teja ) అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయితేజ భౌతిక కాయాన్ని ఇవాళ కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని స్వగృహానికి తీసుకొచ్చారు. సాయితేజ బంధుమిత్రులు, గ్రామస్తుల సందర్శనార్థం సాయితేజ భౌతికకాయాన్ని కాసేపు ఇంటి ముందు ఉంచి ఆ తర్వాత అంత్యక్రియలు జరిపించనున్నారు.
ఈ నెల 8న తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలోని కూనురు వద్ద జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తోపాటు ఆయన సతీమణి మధూలిక రావత్, మరో 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా అసువులుబాసారు. సాయితేజకు భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ, దర్శిని ఉన్నారు.