అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్(NTR) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ఫ్లెక్సీల తొలగింపుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, బాలకృష్ణ(BalaKrishna), లోకేష్పై తీవ్రంగా ఆరోపణలు చేశారు.
నాడు పెద్ద ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పదవి నుంచి తప్పించగా నేడు జూనియర్ ఎన్టీఆర్ను తొలగించుకునేందుకు అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ పార్టీని సర్వనాశం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని విమర్శించారు. వెయ్యిమంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూ. ఎన్టీఆర్ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు .
రాబోయే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేసినా వారి కల నెరవేరదని అన్నారు. గతంలోనూ తనను ఓడిస్తానని చెప్పినా ఏం చేస్తారని తెలిపారు. గుడివాడ ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. వైసీపీలో టికెట్లు రాని వారు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారని , పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరూ వెళ్లడం లేదని కొడాలి నాని వెల్లడించారు. ఓడి పోయే వారికి వైఎస్ జగన్ టికెట్ ఇవ్వనని ముందుగానే చెప్పారని తెలిపారు. తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వైసీపీ అధికారంలోకి రావడానికి మాత్రమే పనిచేస్తానని తెలిపారు.