అమరావతి: ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ అన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశమై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ ప్రేక్షకులు, థియేటర్లు, ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యుల నుంచి రాతపూర్వకంగా అభిప్రాయాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే.
మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామ పంచాయతీల్లో ధరలు తక్కువగా ఉన్నందున వాటిని పెంచాలని పలువురు సభ్యులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. దాదాపు మూడు గంటల పాటు టికెట్ల రేట్లపై చర్చ జరిగింది. రాందాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సానుకూల దృక్పథం ఉన్నా, లేకపోయినా వచ్చే సమావేశంలో అన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.
ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం మాట్లాడుతూ.. అన్ని తరగతుల టికెట్ల ధరలు పెంచాలని, ప్రభుత్వం కొత్త ధరలను నిర్ణయించాలని కమిటీకి తెలిపామన్నారు. అలాగే, సెన్సార్ బోర్డ్ సభ్యుడు, సినీ విమర్శకుడు ఓం ప్రకాష్ మాట్లాడుతూ..కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ప్రభుత్వం టిక్కెట్ రేట్లను నిర్ణయిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీలు, నగర పంచాయతీల్లో ధరలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏసీ, నాన్ ఏసీ థియేటర్ల ఆధారంగా రేట్లు నిర్ణయించాలని కోరారు.