అమరావతి : కరోనా ప్రభావం పండుగలు, పర్వదినాలపైనా పడుతున్నది. ఈ నెల 20 లేదా 21న బక్రీద్ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రార్థనలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈద్గాలు, ఆరుబయట ప్రార్థనలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. 50 శాతం మందితో భౌతికదూరం నిబంధన పాటిస్తూ మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించింది. ప్రార్థన సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించని వారిని మసీదుల్లోకి అనుమతించొద్దని ఇమామ్, మౌజమ్లను ఆదేశించింది. జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు ఉన్న భక్తులు ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. షుగర్, హైబీపీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. పండుగ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాలు, ప్రత్యేక కార్యక్రమాలు, కరచాలనాలు, ఆలింగనాలను నిర్వహించొద్దని ప్రభుత్వం ముస్లిం మత పెద్దలను కోరింది.