తిరుమల : తిరుమల(Triumala) శ్రీవారి పుష్కరిణిలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా చక్రస్నానాన్ని (Chakrasnanam) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఏటా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా ఉన్న 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ పండితులు వివరించారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో పూజలు అనంతరం సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం వద్ద ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేసి చక్రస్నానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు(EO Shyamala rao), ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.