అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరోసారి సస్పెన్షన్కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు తనపై చర్యలు తీసుకున్న ఏపీ ఉన్నతాధికారులపై విరుచుకు పడ్డారు. ఏపీ సీఎం జగన్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై ఉన్న కేసుల విషయాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ప్రతిపదం, వ్యాఖ్యం అబద్ధమని కొట్టిపారేశారు. అబద్దలు తప్పని నిరూపించుకోవడానికి తన వద్ద అన్ని ఆధారాలున్నాయని పేర్కొన్నారు. తనపై తీసుకున్న చర్యలపై న్యాయ సమీక్షకు తిరిగి వెళ్తానని, ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలు న్యాయ సమీక్షలో నిలబడే నిర్ణయాలు కావని స్పష్టం చేశారు.
తనపై ఇంతవరకు ఏ చార్జిషీట్ లేదని వెల్లడించారు. శ్రీలక్ష్మిపై ఛార్జిషీట్ ఉన్నా ఆమెకు నిబంధనలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. తాను ఇంటిలిజెన్సీ అధికారిగా పనిచేసిన సమయంలో పరికరాల కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ తనను సస్పెండ్ చేశారని అయితే అవి నిజం కావని కోర్టులో తేలిందని చెప్పారు.
చట్టానికి కట్టుబడి ఎవరైనా పని చేయాల్సిందేనని దానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని, అందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో తాను ఎవరినైనా వదిలిపెట్టనని వెల్లడించారు. అయితే తనను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదని కొంత మంది వ్యక్తులు, శక్తులు టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు.
కోడి కత్తి ఘటన అడ్డుకున్నందుకే..
2019 ఎన్నికలకు ముందు కోడి కత్తి ఘటనను ఆదారంగా చేసుకుని రాష్ట్రంలో వైసీపీ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలను తాను కొన్ని గంటల్లోనే సమర్ధవంతంగా అడ్డుకున్నందుకే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గడిచిన మూడేళ్లలో తనపై ఎన్నో పిటిషన్లు వేశారని ఇప్పటి వరకు ఏ ఒక్కటి నిరూపించలేక పోయారని తెలిపారు. ‘ఇజ్రాయిల్ కంపెనీ అని పదేపదే అంటున్నారు. అదేమన్నా సూట్కేసు సంస్థా’ అని ఎద్దేవా చేశారు.